Wednesday, 26 August 2015

రాజధానిలో కాల్పుల కలకలం

రాజధానిలో కాల్పుల కలకలం
గుండె ధైర్యం చూపిన సిటీ పోలీస్
దోపిడీ దొంగల అరెస్ట్                                                   గౌసుద్దీన్ షేక్


అత్యాధునిక వాహనాలతో గస్తీ ...నేరం ఎక్కడ జరిగినా క్షణాల్లో ఉంటాం అని తరచుగా చెప్పుకునే పోలీసులు ఆ మాటను నిజం చేసి చూపించారు.నిందితులు కాల్పులకు పాల్పడినా ఏమాత్రం వెరవక గుండె ధైర్యం చూపించారు.నగరంలో భారీ దోపిడీకి ప్లాన్ వేసుకున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు.రాజధానీ నగరంలోని జనసమ్మర్ధమైన జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించినా సిటీ పోలీసుల తెగువకు అద్దం పట్టిందనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
అసలేం జరిగిందంటే....కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన దోపిడీ దొంగలు ఫహీం మీర్జా,ఖాదర్ లు హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో దోపిడీకి దిగాలని ప్లాన్ వేసుకున్నారు.వీరికి ప్రధాన సూత్రధారిగా బిగ్ సి లో కీలక హోదాలో పని చేస్తున్న సమీయుద్దీన్ వ్యవహరించాడు..వీరికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుకున్న సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎలాగైనా పట్టుకోవాలని వలపన్నారు
వీరిని ఎలాగైనా పట్టుకోవాలని టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరి కదలికలపై పూర్తిగా నిఘా పెట్టారు.నిందితులు మాదాపూర్ నుంచి జూబ్లి హిల్స్ వైపు వస్తున్నారని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని జూబ్లీ హిల్స్ లోనే అడ్డుకున్నారు.ఈ సమయంలో పోలీసులు నిందితుల మధ్య చిన్న సైజు వార్ జరిగిందనే చెప్పవచ్చు.వీరిలో ఇద్దరు పారిపోగా ఒకరు మోడీ ధైర్యంతో పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు.ఈ ఘటనలో రోడ్డు మీద వెళుతున్న ఒక వ్యక్తికి బుల్లెట్ ఛాతీలో తగిలింది.పోలీసులు ఒకవైపు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలిస్తూనే ముష్కరులపై పట్టు సడలించలేదు.తుపాకితో వీరంగం సృష్టిస్తున్న దుండగుడిని మూకుమ్మడి దాడితో పట్టుకున్నారు.అంతటితో ఆగకుండా పారిపోయిన మరో ఇద్దరినీ నిమిషాల వ్యవధిలోనే పట్టుకున్నారు.నిందితులు కొంత మంది పాత నేరస్తులతో కలిసి నగరంలో భారీ దోపిడీకి పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే ఈ సంఘటన సిటీ పోలీసుల పనితీరుకు అద్దం పట్టిందనే చెప్పవచ్చు.పోలీసుల సాహసోపేతమైన చర్య వల్ల భారీ దోపిడీకి అడ్డుకట్ట వేయడం సాధ్యమయ్యింది.నిందితులు ఎవరూ వారి ప్లాన్ ఏమిటి వంటి విషయాలను పక్కన పెడితే గుండె ధైర్యం చూపిన సిటీ పోలీసులకు శాల్యూట్ చేయకుండా ఉండగలమా ..